బాబు హయాంలో లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం: కాకాణి

YSRCP MLA Kakani Govardhan Reddy Slams Chandrababu In Nellore  - Sakshi

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా:  ఏపీ సీఎం నారా  చంద్రబాబు నాయుడి హయాంలో ఆయన తనయుడు నారా లోకేష్‌కు మాత్రమే ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం ఇచ్చారని వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరులో కాకాణి విలేకరులతో మాట్లాడుతూ..టీచర్‌ పోస్టుల గురించి అడిగితే నిరుద్యోగులపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏటా నిర్వహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. నిరుద్యోగులు టీచర్‌ పోస్టులకు సంబంధించి వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నారని వెల్లడించారు.

22,814 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా గతంలోనే చెప్పారు..కానీ ఇప్పుడు 7 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చారని విమర్శించారు. టెట్‌ పేరుతో కోట్లాది రూపాయలను నిరుద్యోగుల నుంచి దోచుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో 50 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తానే ఖాళీగా ఉన్న అన్ని టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట ఎంఎల్‌ఏ కిలివేటి సంజీవయ్యపై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ప్రశ్నించే వారిపై పోలీసులను ప్రయోగించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. చంద్రబాబు తన సభలలో కోరి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top