ఈ పాలన ఎప్పుడు విరగడవుతుందో..
టీఆర్ఎస్పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు: ఉత్తమ్
జడ్చర్ల: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఎప్పుడు విరగడవుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే మల్లు రవి గృహప్రవేశానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు తగిన గుర్తింపును ఇవ్వకపోగా మహిళా సాధికారతను తుంగలో తొక్కిందని ఆరోపించారు.
తాము అధికారంలోకి రాగానే మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని, తమ మంత్రివర్గంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 లక్షల మహిళా సంఘాలకు రూ.6 వేల కోట్లు వంద రోజుల్లో గ్రాంటుగా ఇస్తామని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షలు రుణం ఇచ్చివడ్డీని తమ ప్రభుత్వమే భరిస్తుందన్నారు.