సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. స్వప్రయోజనం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద పెట్టారని దుయ్యబట్టారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో భట్టి మాట్లాడుతూ ‘ఇటీవలి నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు’అని ధ్వజమెత్తారు.
హక్కుగా వచ్చే ప్రాణహిత–చేవెళ్లను వదలి.. కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్లను పక్కనబెట్టి కాళేశ్వరానికి రూ. 20 వేల కోట్లు అడగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హైకోర్టు విభజన గురించి కేసీఆర్ మరిచిపోయినట్లున్నారని భట్టి ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరామర్శిస్తే కేసీఆర్ మాత్రం ఆ వైపు చూడలేదని విమర్శించారు.