సినిమా: ఒకరు సూపర్స్టార్ మరొకరు యువ స్టార్. అంతకు మించి మామాఅల్లుళ్లు. వారే నటుడు రజనీకాంత్, ధనుష్. అయితే వీరిద్దరూ మామా అల్లుడుగా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ధనుష్కు రజనీకాంత్ అంటే ఎనలేని అభిమానం. అలాంటి వీరు ఇప్పుడు కుటుంబసభ్యులతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. పేట చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ కుటుంబసభ్యులతో సహా ఇటీవలే విశ్రాంతి కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. నటుడు ధనుష్ నటించి, నిర్మించిన మారి–2 చిత్రం కూడా ఇటీవలే తెరపైకి వచ్చింది. అమెరికాలో మామాఅల్లుళ్లు సరదాగా షికార్లు చేస్తూ తీసుకున్న ఫోటోను సోషల్మీడియాకు విడుదల చేశారు. అంతే అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ధనుష్కు రజనీకాంత్ అంటే వల్లమాలిన అభిమానం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలా తను అమితంగా ఆరాధించే రజనీకాంత్ కథానాయకుడిగా తన సొంత బ్యానర్లో కాలా చిత్రం చేసి నిర్మాతగా అచీవ్ అయిన ధనుష్ రజనీకాంత్తో కలిసి నటించాలనే తన చిరకాల కోరికను మాత్రం తీర్చుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు.
అయితే ఆ కోరిక త్వరలో నెరవేరబోతుందనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పేట చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తదుపరి రాజకీయాలపై దృష్టి సారిస్తారనే ప్రచారానికి నడుమ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం కాదని దర్శకుడు చెబుతున్నా, చిత్రానికి నర్కాలి (కుర్చీ) అనే టైటిల్ను నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుండడంతో కచ్చితంగా ఇది రాజకీయ సెటైరికల్తో కూడిన కథా చిత్రంగా ఉంటుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. రజనీకాంత్ ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు మరో ప్రచారం జరుగుతోంది. యువ దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిండానికి అంగీకరించినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. మరో క్రేజీ విషయం ఏమిటంటే ఇందులో రజనీతో పాటు ఒక ప్రధాన పాత్రను ఆయన అల్లుడు ధనుష్ నటించనున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే, ఈ క్రేజీ చిత్రం తెరకెక్కితే నటుడు ధనుష్ చిరకాల కోరిక కూడా తీరిపోతుంది.