అడ్డతీగల (రంపచోడవరం): తనకు ఉంచిన అన్నాన్ని తినేయడమే కాకుండా.. అడిగినందుకు తిరగబడి కొట్టాడనే ఆగ్రహంతో సొంత చిన్నాన్ననే కర్రతో కొట్టి చంపిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దుశ్చర్తి నివాసి పొడుగుదొరబాబు అతడికి వరుసకు చిన్నాన్న అయ్యే హతుడు పొడుగు గంగరాజుకి పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15న దొరబాబుకి అతడి తల్లి ఉంచిన అన్నం ఆ ఇంటికి వెళ్లి గంగరాజు తినేశాడు.
తనకు ఉంచిన అన్నాన్ని తినేశాడనే తీవ్ర కోపంతో ‘ఎందుకు మా అమ్మ నా కోసం ఉంచిన అన్నాన్ని తినేశావు’’ అని గంగరాజుని ప్రశ్నించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న గంగరాజు దొరబాబుని దుర్భాషలాడుతూ కొట్టడంతో కోపోద్రిక్తుడైన దొరబాబు వెదురుకర్రను తీసుకుని విచక్షణా రహితంగా తలపై కొట్టడంతో తల పగిలి గంగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. దుశ్చర్తి రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దుశ్చర్తి పోలీస్స్టేషన్లో ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన నాటి నుంచి ముద్దాయి పరారీలో ఉంటూ ఆదివారం ఇంటికి వచ్చాడనే సమాచారం తెలిసి వెళ్లి అతడిని అరెస్ట్ చేసి సోమవారం రంపచోడవరం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామన్నారు.