కాసేపట్లో కన్న కూతురు నాట్య ప్రదర్శన ఉంది.. ఇంటి పనులన్నీ ముగించుకొని బిరింగ బడికాడికి పోవాల.. సంతకెళ్లి సరుకులు తెద్దామని భర్తతోపాటు బజారుకు పయనమైంది ఆ తల్లి.. ఆదరాబాదరాగా సరుకులు కొనుక్కొని బైకుపైన బయల్దేరింది..అంతలోనే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఆ తల్లిని కబళించింది.. ఇంటికి చేరనేలేదు..కన్నకూతురు సంబరాన్ని కళ్లారాచూడలేదు.. కళ్లెదుటే భార్య కన్నుమూయడాన్ని తట్టుకోలేకపోయాడు ఆ భర్త.. ‘హేమా.. లే..హేమా.. ఒక్కసారి కళ్లు తెరు.. నువ్వు ఇంటికి రాకపోతే పిల్లలకు నేను ఏమని చెప్పాలి హేమా..’ అంటూ గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. ఈహృదయవిదారక ఘటన ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ధర్మవరం అర్బన్ : రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన చేనేత కార్మికుడు ఆదినారాయణ, హేమావతి (40) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. పెద్దకూతురు పావని మోడల్ స్కూల్లో పదో తరగతి, చిన్న కూతురు శ్రావణి మునిసిపల్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి, కుమారుడు సంతోష్ జీవానంద స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా చిన్న కూతురు శ్రావణి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తన కూతురు డ్యాన్స్ను కళ్లారా చూసి మురిసిపోవాలనుకున్న హేమావతి త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకోవాలనుకుంది. ఉదయమే భర్తతో కలిసి ద్విచక్ర వాహనంలో బజారుకు వెళ్లి సరుకులు కొనుగోలు చేసింది.
ఇంటికి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్ 0212) వెనుకవైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వెనుక కూర్చున్న హేమావతి బస్సు వెనుక చక్రాల కిందకు పడింది. బస్సు ఆమెపై వెళ్లడంతో నడుం భాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త ఆదినారాయణకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే బస్సును ఆపిన డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. స్థానికులు రోడ్డు ప్రమాద సంఘటనను చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. భార్య కళ్లముందే మృతిచెందడంతో భర్త ఆదినారాయణ బోరున విలపించాడు. ‘నీ చిన్నకూతురు శ్రావణి ఈరోజు పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ చేస్తోంది. నువ్వు ఎంతగానో చూడాలని తపన పడ్డావు. ఇప్పుడిలా చనిపోతే నేను ఇంటికి వెళ్లి పిల్లలకు ఏమి సమాధానం చెప్పాలం’టూ భర్త రోదించిన తీరు కలచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.