సాక్షి, సిటీబ్యూరో: తనతో సహజీవనం చేస్తున్న ప్రేయసి కోసం పెడదారిపట్టి, ఆమెతో కలిసి బతకడం కోసం నేరాలు చేస్తున్న ఓ నిందితుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి తొమ్మిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్తో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. సంతోష్నగర్లోని ఈదిబజార్కు చెందిన సయ్యద్ వసీమ్కు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు. దీంతో ఇతడి తల్లిదండ్రులు పిల్లలకు చదువులు చెప్పించలేకపోయారు. బతుకుతెరువు కోసం సెంట్రింగ్ పని నేర్చుకున్న వసీమ్ ప్రస్తుతం వట్టేపల్లిలో ఉంటూ అదే చేస్తున్నాడు. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత ఇతడికి అనేక దురలవాట్లు అయ్యాయి. ఏడాది క్రితం ఓ మహిళతో అయిన పరిచయం స్నేహంగా... ఆపై సన్నిహిత సంబంధంగా మారింది. తనకు వచ్చే ఆదాయ ంతో ప్రేయసితో కలిసి బతకడం, ఇతర ఖర్చులను తట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీం తో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం మొదలెట్టాడు.
గత ఏడాది ఫలక్ నుమ, సంతోష్నగర్ ప్రాంతాల్లో రెండు నేరాలు చేశాడు. 2018 నవంబర్లో అరెస్టు అయిన ఇతగాడు ఆ తర్వాతి నెల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఇటీవల తన పాత పంథా కొనసాగిస్తూ చంద్రాయణగుట్ట, భవానీనగర్లోని రెండు ఇళ్లల్లో చోరీలు చేశాడు. ఈ కేసులను దక్షిణ మం డల టాస్క్ఫోర్స్ దర్యాప్తు చేసింది. నేరస్థలా లకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను సేకరించింది. అందులో కనిపించే అనుమానితుడి నడక, శరీరాకృతుల్ని గుర్తించింది. వీటి ఆధారంగా పాత నేరగాళ్లతో పోల్చి చూసి వసీమ్ నిందితుడిగా గుర్తించింది. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, వి.నరేందర్, మహ్మద్ తర్ఖుద్దీన్ రంగంలోకి దిగి సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలు అంగీకరించిన వసీమ్ బంగారం అమ్మలేదని చెప్పాడు. మరికొన్ని నేరాలు చేసిన తర్వాత ఒకేసారి భారీ మొత్తం విక్రయించాలని భావించానన్నాడు. దీంతో టాస్క్ఫోర్స్ అతడి నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది.