ఫోన్ బిల్లు చూసి.. గుండె గుబేల్!
న్యూఢిల్లీ : విహారయాత్రకు వెళ్లిన వ్యక్తికి నెలాఖరుకు వచ్చిన ఫోన్ బిల్లు చూసి గుండె గుబేల్మన్నది. ఎందుకంటే అతడికి వచ్చిన బిల్లు వందల్లోనో, వేలల్లోనో కాదు.. దాదాపు రెండు లక్షల బిల్లు వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. న్యూఢిల్లీకి చెందిన నితిన్ సేథి గత నెలలో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ టూర్కి వెళ్లాడు. ఈ క్రమంలో 10 రోజులకుగానూ ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీని యాక్టివేట్ చేసుకున్నాడు. టూర్ ముగిసిన తర్వాత భారత్కు వచ్చినా ప్యాకేజీ డి యాక్టివేట్ కాలేదు.
దీంతో సేథికి జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల ఫోన్ బిల్లు రూ. 1.86 లక్షలు జనరేట్ అయింది. ఈ మేరకు ఎయిర్టెల్ నుంచి ఆ బిల్లు మెస్సేజ్ రాగానే ఆ కస్టమర్ షాక్ తిన్నాడు. ఎయిర్టెల్ కస్టమర్ కేర్కు కాల్ చేసి ఫోన్ బిల్లు భారీ మొత్తంలో రావడంపై ఫిర్యాదు చేశాడు. సాంకేతిక కారణాల వల్ల బిల్లు భారీగా వచ్చిందని త్వరలోనే తప్పును సరిదిద్దుకుని మరో బిల్లును పంపిస్తామని ఎయిర్టెల్ ఎగ్జిక్యూటీవ్ సెథికి హామీ ఇచ్చారు. తనకు వచ్చిన భారీ బిల్లు విషయాన్ని బాధితుడు సేథి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్గా మారింది.