సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపుతోంది. ఆయన చెప్పే మాట వేల కుటుంబాల్లో సంతోషం పంచుతోంది. ఒక్క భరో సా వేల మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అడుగడుగునా జనసంద్రాన్ని తలపిస్తోంది. అడుగుకో గాథ... కన్నీటి వ్యధ... వినిపిస్తోంది. ‘అన్నా మీరు రావా లి... రాజన్న రాజ్యం తేవాలి’ ఇదీ దగా పడిన జ నం నుంచి వస్తున్న మాట. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో అడుగు పెట్టునప్పటినుంచి వేలాది సమస్యలు వినిపించారు. ఎన్నో వేదనలు ఆయన దృషి ్టకి తీసుకువచ్చారు. పాలకుల దుర్నీతివల్ల నష్టపోయిన వైనాన్ని ఏకరువు పెడుతున్నారు. అన్నీ వింటూ ప్రజా సంక్షేమమే తమ అభిమతమని స్పష్టం చేస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు.
జనసంద్రంగా మారినరామభద్రపురం
బొబ్బిలి మండలం పారాది క్రాస్నుంచి ప్రారంభమైన పాదయాత్ర విశాఖ –రాయపూర్ అంతర్ రాష్ట్ర రహదారిపై రోజంతా సాగింది. పారాది క్రాస్ నుంచి గొల్లపేట క్రాస్, రొంపిల్లి క్రాస్కు చేరుకుంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం రామభద్రపురానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై అడుగడుగునా పల్లె ప్రజలు ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. జననేత వెంట ప్రతీ ఒక్కరూ అనుసరించడంతో ఆ మార్గం జనసంద్రంగా మారింది.
అడుగడుగునావెల్లువెత్తుతున్న వేదనలు
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజా సంకల్పయాత్రలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి అనేక వ్యాధులను తొలగించటంతో తమ బిడ్డకు వైద్యం చేయించుకోలేకపోయామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శ్రావణి, ప్రసాద్ దంపతులు మొరపెట్టుకున్నారు. తమ నాలుగు నెలల పాప మెదడులో నీరు చేరిందనీ, వైద్యంకోసం రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారనీ, ఆరోగ్యశ్రీ పథకంలో ఆ వ్యాధిని గుర్తించకపోవటం వల్ల వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని సాఫ్ట్బాల్ క్రీడాకారులు వాపోయారు. శిక్షణ తీసుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని, రాష్ట్ర స్థాయి పోటీలకు సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తుందని గోడువెళ్లబోసుకున్నారు. కళాశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నామమాత్రంగా మారిందని, ఇంజినీరింగ్ ఫీజులు రూ.లక్ష దాటినా ప్రభుత్వం రూ.35వేలే చెల్లిస్తోందని వాపోయారు. స్థానికంగా ప్రభుత్వ కళాశాల లేకపోవటంతో ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఎంతో కష్టపడి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర రావటం లేదని, మార్కెట్లో కేవలం దళారీలు మాత్రమే బాగుపడుతున్నారని రామభద్రపురం రైతులు పిర్యాదు చేశారు. అన్ని ఓపికగా విన్న జననేత వారిని ఓదార్చారు. మంచిరోజులు త్వరలో వస్తాయని... సమస్యలన్నీ పరిష్కారం చేయగలమని హామీ ఇచ్చారు.
నాయకుడి వెంటనడిచిన సైనికులు
పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్ధసారధి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్రాజు, బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ముమ్మిడివరం, పెడన నియోజకవర్గాల సమన్వయకర్తలు సతీష్కుమార్, జోగి రమేష్, నర్సారావుపేట పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయులు, గొట్టిపాటి భరత్ తదితరులు పాల్గొన్నారు.