పోలవరం కాంట్రాక్టర్ను మార్చబోం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ను మార్చితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని, దానిని భరించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సోమవారం నితిన్ గడ్కారీ మీడియా ప్రతినిధులకు తేనీటివిందు ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టును తాను సందర్శించానని, 2019 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పారన్నారు.
నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు తాము సిద్ధమని తెలిపారు. పనులకు సబంధించిన బిల్లులు సమర్పించిన మూడ్రోజుల్లో 75 శాతం నిధులు విడుదల చేస్తామని, పరిశీలన అనంతరం మిగిలిన 25% నిధులను విడుదల చేస్తామని నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు నాబార్డు ద్వారా నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు.