వ్యసనమే బిడ్డను బలిగొంది | Sakshi
Sakshi News home page

వ్యసనమే బిడ్డను బలిగొంది

Published Tue, Jun 30 2015 9:07 PM

father drinkinng habit kills sun in krishna district

-మద్యం సేవించి సైకిల్‌పై నుంచి తూలిపడ్డ తండ్రి
-లారీ ఢీకొని కుమారుడు దుర్మరణం         
-ఉండిలో దుర్ఘటన


పశ్చిమగోదావరి జిల్లా(ఉండి): తండ్రి వ్యసనం కుమారుడు ప్రాణాలను హరించింది. కుటుంబ పెద్ద బాధ్యతారాహిత్యం ఎనిమిదేళ్ల బాలుడి ఉసురు తీసింది. ఫుల్లుగా మద్యం సేవించిన తండ్రి సైకిల్ నడుపుతూ తూలిపడటంతో సైకిల్ వెనుక కూర్చున్న కుమారుడు కింద పడి లారీ ఢీకొని అనంత లోకాలకు వెళ్లిపోయూడు. ఉండి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

కృష్ణా జిల్లా పెడన మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన మోయ్యే సోమరాజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడు హరిజనరావు (8)తో కలిసి సైకిల్‌పై వెళుతున్నాడు. ఆకివీడు వైపు నుంచి వస్తూ ఉండి పాత సినిమా హాల్ సెంటర్‌లో రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చే సరికి సైకిల్‌పై నుంచి తూలిపడ్డాడు. అక్కడి నుంచి వంద మీటర్ల దూరం వెళ్లేసరికి మూడు సార్లు కింద పడటంతో స్థానికులు సోమరాజును మందలించారు.

బాలుడిని తీసుకుని ప్రయాణించవద్దని సూచించారు. అయినా వినకుండా ముందుకు వెళ్లిన సోమరాజు మళ్లీ తూలిపడ్డాడు. దీంతో సైకిల్ వెనుక కూర్చున్న బాలుడు హరిజనరావు రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న మట్టి లోడు టిప్పర్ లారీ హరిజనరావుపై నుంచి వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సోమరాజు కుడిచేతికి తీవ్ర గాయమైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయాలైన సోమరాజును, హరిజనరావు మృతదేహాన్ని 108 వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో కన్న కొడుకు ప్రాణాలు బలిగొన్న సోమరాజును స్థానికులు తిట్టిపోశారు.

కొద్దిసేపటికి మైకం నుంచి బయటపడిన సోమరాజు తన కుమారుడిని బతికించాలంటూ బతిమిలాడాడు. కుటుంబ కలహాలతో బయటకొచ్చి.. సోమరాజుకు భార్య వెంకటేశ్వరమ్మ, కుమార్తె దానేశ్వరి, కుమారుడు హరిజనరావు ఉన్నారు. కుమార్తె అదే గ్రామంలో 5వ తరగతి, హరిజనరావు 2వ తరగతి చదువుతున్నారు. ఒకటి, రెండు రోజుల క్రితం భార్యతో గొడవ పడిన సోమరాజు కుమారుడితో కలిసి ఇల్లు విడిచిపెట్టాడు. ఇలా బయటకు వచ్చిన సోమరాజు సైకిల్‌పై కుమారుడితో వెళుతూ ప్రమాదం బారినపడ్డాడు

Advertisement
Advertisement