ముందు జాగ్రత్త చర్యలు పాటించండి: గవర్నర్ విఙ్ఞప్తి
సాక్షి, అమరావతి: ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ (కోవిడ్-19)పై యుద్ధాన్ని గెలవచ్చని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఏపీ రాజ్భవన్లో మాట్లాడుతూ.. ప్రజలు ఇంట్లో ఉండాలని, ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే మీ చేతులను తరచూ హ్యాండ్ శానిటైజర్లతో కడగాలని తెలిపారు. ఫేస్ మాస్క్లతో ముఖాన్ని కప్పుకోవాలని, చేతితో తాకిన ఉపరితలాలను శుభ్రపరచాలని పేర్కొన్నారు. (విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి)
‘సామాజిక దూరాన్ని కొనసాగించండి, పది మందికి పైగా గుమికూడకుండా ఉండండి. ఇంట్లో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు కనిపిస్తే, కాల్ సెంటర్ను సంప్రదించండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోని వైద్యులను సంప్రదించి, వెంటనే వారి సలహాను పాటించండి. పరిస్థితి సాధారణం అయ్యే వరకు మతపరమైన ప్రదేశాలను సందర్శించకుండా ఉండండి. సూచనలు పాటిస్తే మనల్ని, మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకోవచ్చు’ అని బిశ్వభూషణ్ హరిచంద్రన్ తెలిపారు.