చౌటుప్పల్ : ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి శుక్రవారం చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసి కేంద్రాన్ని ఎత్తివేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నర్సరీకి వెళ్లి మొక్కలను పరిశీలించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జూన్ 2లోపు పూర్తి కావాలని ఆదేశించారు. అక్కడి నుంచి చిన్నకొండూరు గ్రామానికి వెళ్లి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థుల యూనిఫామ్ కుట్టడం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆమె వెంట డీఆర్డీఓ కృష్ణణ్, సివిల్ సప్లయ్ డీఎం గోపీకృష్ణ, డీఎస్ఓ శ్రీనివాస్రెడ్డి, ఇంచార్జి డీసీఓ ప్రవీణ్కుమార్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ సందీప్కుమార్, డీఎల్పీఓ ఉన్నారు.