బీజేపీతో దేశానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

బీజేపీతో దేశానికి ముప్పు

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

- - Sakshi

భువనగిరిటౌన్‌ : బీజేపీతో దేశానికి ముప్పు అని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికత్వానికి హాని కలిగిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి సీట్లు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ తన విధానాలతో రాజ్యాంగ వ్యవస్థకు విఘాతం కలిగిస్తూనే మరోవైపు అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేస్తుందని దుయ్యబట్టారు. తాము రాజ్యాంగ పరిరక్షణ కోసం పూల మాలలు వేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను ఆదరించాలని కోరారు. సీపీఎంకు వేసే ఓటు సీపీఎంకే కాదని, రాష్ట్ర అభివృద్ధికి వేసినట్లని పేర్కొన్నారు.

బీజేపీవి ఫాసిస్టు విధానాలు : తమ్మినేని

బీజేపీవి ఫాసిస్టు విధానాలని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు యత్నిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లకే కాకుండా హిందువులకు సైతం అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారని, చేర్చుకునే వారికి కూడా సిగ్గులేదని విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలు వ్యాపారాలతో ముడిపడి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరికి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఘనమైన చరిత్ర ఉందని, అటువంటి గడ్డపై నుంచి సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరారు.

ఫ పదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది

ఫ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

జహంగీర్‌ను గెలిపిస్తే ప్రజల గొంతుకవుతాడు : వీరయ్య

గంగానది ప్రక్షాళనకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య ప్రశ్నించారు. మూసీ కాలుష్యంపై ప్రశ్నించాలంటే సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని, పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుక అవుతారని పేర్కొన్నారు. దేశంలో కులవృత్తులు దెబ్బతింటున్నాయన్నారు. కార్మికుల కనీస వేతనంపై శాసీ్త్రయ అంచనాలు లేవని, అందుకు సమగ్ర శాసనం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతి, మల్లు లక్ష్మి, తీగల సాగర్‌, జాన్‌ వెస్లీ, అబ్బాస్‌, డి.జి. నర్సింగరావు, పోతినేని సుదర్శన్‌, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి కొండమడుగు నరసింహ మట్టుపల్లి అనురాధ పైళ్ల ఆశయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement