కమలాపూర్: విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా చదువుతోపాటు ఆసక్తి ఉన్న కళల్లో రాణించాలని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల (ఎంజేపీ) కార్యదర్శి బి.సైదులు అన్నారు. ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కమలాపూర్లోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫైన్ ఆర్ట్స్ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు కళల పట్ల ఆసక్తి పెంపొందించడంతోపాటు వారిలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికి తీయడానికే రాష్ట్రస్థాయిలో ఫైన్ ఆర్ట్స్ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో పాల్గొనడానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబర్చారని, అందుకనుగుణంగా రానున్న రోజుల్లో ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము నేర్చుకున్న ఆటపాటలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అంతకుముందు ఈ ఫైన్ ఆర్ట్స్ శిబిరం ద్వారా విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ను ఆయన తిలకించారు. కార్యక్రమంలో ఎంజేపీ గురుకులాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ తిరుపతి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్సీఓ మనోహర్రెడ్డి, హనుమకొడ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీసీఓలు సరిత, వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్స్ ఓదెల మల్లయ్య, ప్రపుల్లాదేవి, ఎంజేపీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంజేపీ గురుకులాల
రాష్ట్ర కార్యదర్శి సైదులు
ముగిసిన రాష్ట్రస్థాయి ఫైన్ ఆర్ట్స్ శిబిరం