వీరఘట్టం: మండలవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. అయితే తెట్టంగి గ్రామంలో మాత్రం జనసేన, టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో జరిగిన గొడవ కొట్లాటకు దారితీసింది.ఈ కొట్లాటలో దళిత మహిళా సర్పంచ్ అలజంగి విజయమ్మకు గాయాలు తగలడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు.అయితే కవ్వింపు చర్యలు, గొడవల్లో గ్రామానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి ప్రోద్బలం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.ఇటీవల ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్లు గ్రామంలో చేపట్టిన ప్రచార ర్యాలీకి గ్రామస్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే కూటమి సభ్యులకు అనుకూలంగా ఉన్న ఓ ఉద్యోగి వైఎస్సార్సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోలింగ్ రోజున తగాదాకు ప్లాన్ చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా తగాదాలకు దారితీశాయంటే ముమ్మాటికీ ఆ ప్రభుత్వ ఉద్యోగి కుట్రేనని సర్పంచ్ అలజంగి విజయమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. సదరు రెవెన్యూ ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పలకరింపు
ఈ కొట్లాటలో గాయపడిన సర్పంచ్ విజయమ్మ, కొందరు వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం రాత్రి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ విషయం తెలియడంతో గాయాలపాలైన సర్పంచ్ విజయమ్మను, వైఎస్సార్సీపీ నాయకులను ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్లు ఫోన్ చేసి పలకరించారు.ఈ గొడవలకు కారకులైన వారిపై తగు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. అయితే తెట్టంగిలో సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన తగాదాపై ఇరువర్గాలు పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ సిబ్బంది పహారా కాస్తున్నట్లు చెప్పారు.
తెట్టంగిలో ఇరువర్గాల కొట్లాట
సర్పంచ్తో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తకు గాయాలు
ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు