మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
విజయనగరం ఫోర్ట్: మత్స్యకారుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారిని అన్నివిధాలా అదుకుంటోందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్లో ప్రపంచ మత్య్సకార దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు రూ.33.29 లక్షల విలువైన రెండు ఫిష్ సీడ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను, రూ.20 లక్షల విలువైన ఇన్సులేటెడ్ వాహనాన్ని జెడ్పీ చైర్మన్ అందజేశారు. 32 టూవీలర్స్కు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించాలని జేసీ మయూర్అశోక్కు సూచించారు. అనంతరం స్థానిక విలేకరులతో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో పాటు డీజిల్ రాయితీలు, వేట సామగ్రిని అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఏటా వేట నిషేధ సమయంలో వైఎస్సార్ మత్యకార భరోసా కింద రూ.10 వేలు చొప్పున మత్స్యకారుల ఖాతాలకు జమచేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జేసీ మయూర్ అశోక్, మత్య్సశాఖ డీడీ నేతల నిర్మలాకుమారి, మత్య్సకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, గంట్యాడ జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఘనంగా ప్రపంచ మత్య్సకార దినోత్సవం