అ‘ద్వితీయ’ంగా..
మొత్తం వైద్య శిబిరాల లక్ష్యం 605
అర్బన్ లక్ష్యం 551
ఏర్పాటు చేసినవి 434
రూరల్ లక్ష్యం 54
ఏర్పాటు చేసినవి 54
మొత్తం ఓపీ సేవలు 1,80,486
అర్బన్ ఓపీలు 1,54,074
రూరల్ ఓపీలు 26,412
నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన కేసులు 749 (అర్బన్ 635, రూరల్ 114)
● రికార్డు స్థాయిలో ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణ
● ప్రతి రోగికి వైద్యం, మందులు,
వివిధ రకాల పరీక్షలు ఉచితం
● ఒక్కో శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టులతో పాటు ఐదుగురు వైద్యులు
● మెరుగైన చికిత్స అవసరమైన రోగులను నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్
● 488 శిబిరాల ద్వారా
1,80,486 మంది రోగులకు వైద్య సేవలు
మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడతలో భాగంగా ఊరూ వాడా ఏర్పాటు చేసిన శిబిరాలకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, అవసరమైన వైద్య సేవలు పొందారు. ఎన్నికల సమయంలో కూడా ఈ శిబిరాలు రోగులతో కిటకిటలాడాయి.
లక్ష్యానికి చేరువగా..
ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష రెండో విడత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఈ నెల 21(మంగళవారం) వరకు ఈ శిబిరాలు కొనసాగాయి. అర్బన్లో 551, రూరల్లో 54 కలిపి మొత్తం 605 వైద్య శిబిరాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి అర్బన్లో 434, రూరల్లో 54 శిబిరాలు పూర్తయ్యాయి.
ఇంకా అర్బన్లో మాత్రమే 117 వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 488 వైద్య శిబిరాల ద్వారా లక్షా 80 వేల 486 మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించారు.
అందుబాటులో మెరుగైన వైద్యం
సాధారణ వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలతోపాటు, స్పెషలిస్టు వైద్య సేవలు కూడా ఈ వైద్య శిబిరాల్లో అందిస్తున్నారు. ప్రతి శిబిరంలో ఈసీజీ, బీపీ, సుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, కఫం, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా తదితర 9 రకాల వైద్య పరీక్షలు, 175 రకాల మందులు అందుబాటులో ఉంచారు. జనరల్ ఫిజీషియన్, డెంటల్, గైనిక్, పిల్లల వైద్యులు, కంటి వైద్యుడితోపాటు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొని, ప్రతి రోగికి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యం కోసం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పనిలేకుండా తమ నివాసాలకు దగ్గర్లోనే మెరుగైన వైద్య సేవలు అందడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆదరణ బాగుంది
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి, తమ ఆరోగ్య సమస్యలకు వైద్యం పొందారు. సెలవు రోజుల్లో మినహా మిగిలిన అన్ని రోజులూ వైద్య శిబిరాలు నిర్వహించాం. శిబిరానికి వచ్చే రోగులకు అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సతో పాటు, ఉచిత మందులు కూడా అందిస్తున్నాం. మెరుగైన చికిత్స అవసరమయ్యే రోగులను నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం.
– డాక్టర్ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, విశాఖపట్నం
కేటగిరీల వారీగా వైద్య సేవలు పొందిన రోగులు
కంటి సంబంధిత రోగులు 19,652
కళ్లద్దాలకు రిఫరెన్స్ 8,273
కేటరాక్ట్ చికిత్సకు రిఫరెన్స్ 1,460
ఆర్థోపెడిక్ 18,587
గైనిక్ 8,666
పీడియాట్రిక్ 9,450
డెంటల్ 9,651
(మిగిలినవి జనరల్ ఫిజీషియన్ సేవలు)