● 14 ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో లీడర్ల జేబులు నిండేవి ● జగనన్న పాలనలో పేదల జేబులు నిండుతున్నాయ్ ● ఏర్పేడు సభలో రాజ్యసభ్యుడు ఆర్.కృష్ణయ్య వెల్లడి
ఏర్పేడు: ‘రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కావాలి.. జగన్ లాంటి సీఎం మాకు కావాలి’అని పక్క రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఏర్పేడు ఆర్టీసీ బస్టాండు కూడలిలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూ లనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇటీవల తాను తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించానని, అక్కడ ఏపీలో అమలవుతున్న పథకాలు ఇక్కడ లేవని, ఆ పథకాలు పేదల జీవితాలను మారుస్తాయని, తమకు కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని అక్కడి ప్రజలు తమ మనోగతాన్ని తనతో పంచుకున్నారని వివరించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను బీసీలు పాలిస్తున్నా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఒడిశాలో తాను పర్యటించినప్పుడు రోడ్డు పక్కన చిన్న దుకాణాల్లో బడికి వెళ్లాల్సిన చిన్న పిల్లలు వెట్టిచాకిరీ చేస్తూ కనిపించారని, ఆ దృశ్యాలు తనను బాధించాయని చెప్పారు. మన రాష్ట్రంలో బడి ఈడు పిల్లలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దయవల్ల అలాంటి పరిస్థితి లేదన్నారు. స్కూళ్లు మారడమే కాకుండా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు వేసి ఆదుకుంటున్నట్టు వెల్లడించారు.
పేదలను పట్టించుకోని బాబు
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పాలనలో పేదల సంక్షేమం కోసం ఏ నాడూ ఆలోచించలేదని, ఆయన ధనికుల జేబులు నింపి పేద ప్రజలను గాలికొదిలేశారని కృష్ణయ్య మండిపడ్డారు. అయితే జగన్మోహన్రెడ్డి పాలనలో పేదప్రజల జేబులు నిండాయని, వారి జీవితాలు వికశించాయన్నారు. బీజేపీ కూడా పెత్తందార్లు, కార్పొరేటర్లకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ఆయన పేదల సంక్షేమం కోసం సొంతంగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారని కొనియాడారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్రెడ్డి, తిరుపతి ఎంపీగా మద్దిల గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర గొర్రెల పెంపకం సంఘం అధ్యక్షుడు గన్నేరు ప్రకాష్యాదవ్, మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్రెడ్డి, వైఎస్సా ర్ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, కో–ఆప్షన్ సభ్యుడు బత్తిశెట్టి, వైస్ ఎంపీపీ శ్రీనివాసులుయాదవ్, సింగిల్విండో అధ్యక్షుడు జనార్దన్ యాదవ్, సర్పంచ్ శివయ్య పాల్గొన్నారు.