ఎస్ఎంసీ సభ్యులకు
శిక్షణ తరగతులు
తిరుత్తణి: పాఠశాల ఎస్ఎంసీ సభ్యులకు కేజీకండ్రిగలో మంగళవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. తిరుత్తణి యూనియన్ కేజీకండ్రిగ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. 11 పాఠశాలల నుంచి హెచ్ఎంలు, ఎస్ఎంసీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని హెచ్ఎం దామోదరన్ ప్రారంభించారు. బీఆర్సీ ట్రైనీ టీచర్ సెంథిల్ పాఠశాల నిర్వహణకు సంబంధించి విద్యలో నూతన పద్ధతులు, సౌకర్యాలు, విద్యార్థులను ఆకట్టుకునే పద్ధతులపై అవగాహన కల్పించారు.
శ్మశానం ఆక్రమణపై నిరసన
పళ్లిపట్టు: శ్మశానం ఆక్రమించిన వ్యక్తిపై చర్చలు తీసుకోవాలని కోరుతూ మహిళలు మంగళవారం ఆర్టీసీ బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. ఆర్కేపేట యూనియన్ అమ్మనేరి పంచాయతీలోని ఒడ్డర్కాలనీలో 30కిపైగా కుటుంబాలు ఉంటున్నాయి. గ్రామానికి సమీపంలోని శ్మశానం స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆక్రమించినట్లు తెలిసింది. గ్రామస్తులు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళలు తిరుత్తణి–షోళింగర్ రోడ్డులోని అమ్మనేరి వద్ద బస్సును అడ్డుకుని రాస్తారోకో చేశారు. ఆర్కేపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరిమించారు.
తిరుచ్చిలో ఆభరణాల ప్రదర్శన
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా బుధ, గురువారాలలో బంగారు ఆభరణాల ప్రదర్శనకు వుమ్మిడి బంగారు జ్యువెలర్స్(వీబీజే) ఏర్పాట్లు చేసింది. సంగం హోటల్ వేదికగా జరిగే ఈ ప్రదర్శనకు సర్వం సిద్ధం చేశామని సంస్థ మేనేజింగ్ పార్టనర్ అమరేంద్రన్ వుమ్మిడి తెలిపారు. పురాతన ఆభరణాల డిజైన్ల నుంచి ఆధునిక బంగారు ఆభరణాల వరకు కొలువు దీర్చనున్నామని వివరించారు. క్రాఫ్ నైపుణ్యాలను, ఆభరణాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించామన్నారు.