మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని గురువారం తెల్ల వారు జామున 5గంటలకు వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. అర్చకులు క్రిష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మనాభా చార్యులు, బ్రహ్మ చార్యులు, ఫణిభూషణమంగాచార్యులు బృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్ర,బెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు ,తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో కల్యాణతంతును ముగించారు. కల్యాణతంతును వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు గుండ్లపల్లి భక్తులు ఎదుర్కోళ్ల దివిటీలు సమర్పించగా , పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామస్తులు, సూర్యాపేట జిల్లా లింగగిరి వాస్తవ్యులు శ్రీస్వామి, అమ్మవార్లకు వార్షికంగా మెట్టెలు, మంగళసూత్రం ,ఉత్తర జంధ్యాలు, వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీకేశవతీర్థ ఆశ్రమంలో కల్యాణమూర్తులకు గరుడవాహనసేవ నిర్వహించారు. అదేవిధంగా నృసింహోపాసనం పద్యపఠనం, వేదపఠనం, భక్తిసంగీతం, శ్రీసీతారామకళ్యాణం హరికథ, శ్రీమట్టపల్లి క్షేత్రమహత్యం బుర్రకథ చేపట్టారు. భక్తిసంగీతవిభావరి అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మీసమేతంగా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ చరమందరాజు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో వైఽభవంగా
శ్రీలక్ష్మీనృసింహుడి తిరుకల్యాణం
భారీగా తరలివచ్చిన భక్తులు