ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 131 మంది ఉద్యోగాల కు ఎంపికయ్యారు. 13 కంపెనీల ప్రతినిధులు హాజరై 322 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. విద్యార్హత, నైపుణ్యాలు ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు, ప్లేస్మెంట్ అధికారి కామేశ్వరరావు పర్యవేక్షించారు.
స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్లను శుక్రవారం అదనపు ఎస్పీ జి.ప్రేమ్కాజల్ పరిశీలించారు. సీసీ కెమె రాల ఫుటేజ్ పరిశీలించి భద్రతపై గార్డులకు పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏఓబీ సరిహద్దులో కార్డన్ సెర్చ్
పాతపట్నం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం మండలం బూరగాంలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాతపట్నం సీఐ నల్లి సాయి ఆధ్వర్యంలో పాతపట్నం, మెళియాపుట్టి ఎస్ఐలు మహమ్మద్ యాసీన్, రాజేష్, ఎస్టీఎఫ్ పోలీసులు, సివిల్ పోలీసు లు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. వాహ నాల ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యాసీన్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 25 నుంచి నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు, ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం శ్రీకాకుళంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్, వేంకటేశ్వర ఇంజినీరింగ్, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, నరసన్నపేటలోని గొట్టేపల్లి కోర్ టెక్నాలజీస్, టెక్కలి ఆదిత్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంద్రాలుగా పరీక్షలు జరుగుతాయని వివరించారు. 830 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7.30 గంటల నుంచి అనుమతిస్తామని, 8.30 తరువాత వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలో జెరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. సమావేశంలో సెక్షన్ ఆధికారి ఎం. బాలరాజు, సహాయకులు పద్మప్రియ, వైద్య, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.