అరసవల్లి: జిల్లాలో శిష్ట కరణాలంతా ఈ నెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని రాష్ట్ర శిష్టకరణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కంటిమహంతి అనూష పట్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం అరసవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శిష్టకరణాలను దివంగత వైఎస్సార్ హయాంలో బిసిల్లో చేర్చితే.. ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మనకు ప్రత్యేకంగా సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి జీవన ప్రమాణాలను పెంచి మరింత గుర్తింపునిచ్చారని చెప్పారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు, బలహీన, వెనుకబడిన కులాల వారికి నేరుగా సంక్షేమం అందుతుందన్నారు. మనమంతా జగన్కు కృతజ్ఞత చూపించాల్సిన సమయం ఇదేనని..వైఎస్సార్ అభ్యర్థులను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ డైరక్టర్ సదాశివుని కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో శిష్టకరణాలంతా వైఎస్ జగన్కు రుణపడి ఉన్నామని, ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవాలన్నారు. మనవాళ్లలో ఏ పార్టీ సానుభూతి పరులైనప్పటికీ..ఈ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గుర్తుకే ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు సదాశివుని కృష్ణ, ఉరిటి అప్పారావు, వి.అరుణకుమారి, ఆలిండియా శిష్టకరణ అధ్యక్షుడు కె.బెనర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివం జ్యోతి పట్నాయక్, ఎస్.ఎం.కె.మహంతి, శ్రీకాకుళం వైఎస్సార్ సోషల్మీడియా కోఆర్డినేటర్ సురేంద్ర పట్నాయక్, దుగ్గివలస శ్రీనివాసరావు, చంద్రమోహన్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని శిష్టకరణ సంఘ ప్రతినిధులు దర్శించుకున్నారు. సీఎం మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పూజలు చేయించారు.
ఏపీ శిష్ట కరణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్