నెల్లూరు (దర్గామిట్ట): కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులను పారదర్శకంగా, అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరినారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఉదయం 8 గంటలకు కను పర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది అందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా అందించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్కు కేటాయించిన రిజర్వ్ సిబ్బంది అందరూ కౌంటింగ్ కేంద్రంలోనే అందుబాటు లో ఉండాలన్నారు. కౌంటింగ్ సమయంలో అవసరమైన అన్నిరకాల ఫామ్స్, రబ్బరు స్టాంపు ముద్రల ను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఫాం–17సీ లో పొందుపరిచి కౌంటింగ్ సూపర్వైజర్ ద్వారా రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు. ఫాం–17సీ జెరాక్స్ కాపీని ఏజెంట్లకు అందజేసి అకనాలెడ్జ్మెంట్ కాపీని తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానికల్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైందన్నారు. ఈ విషయంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సందేహం ఉంటే ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలు పెట్టాలన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుళ్లతో పాటు రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ మొత్తం 17 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే వెంటనే బెల్ ఇంజినీర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేసి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నుడా వీసీ బాపిరెడ్డి, ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ఈటీపీబీఎస్) ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారి సురేష్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు సేతు మాధవన్, వికాస్ మర్మత్, విద్యాధరి, చిన్నఓబులేసు, మలోల, ప్రేమ్కుమార్, మధులత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ విధుల్లో అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరి
రిజర్వు సిబ్బంది కౌంటింగ్
కేంద్రంలోనే ఉండాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ఎం.హరినారాయణన్