ఇందుకూరుపేట: ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టక్ ఖాదర్వలి తెలిపారు. మండలంలోని జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కొత్తూరులో శుక్రవారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో టీబీ రెఫరెల్స్ పెంచాలన్నారు. పీహెచ్సీ వైద్యాధికారులు కిశోర్కుమార్, బ్రహ్మేశ్వరనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తొలుత ఎంపీడీఓ సాయి లహరి పరీశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, సర్పంచ్ విజయమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ సుధాకర్రావు, సూపర్వైజర్లు రమ, సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు.
● జగదేవిపేటకు చెందిన జక్కా శ్రీనివాసులురెడ్డి (జేఎస్ రెడ్డి)కి పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. శ్రీనివాసులురెడ్డి తన సొంత స్థలంలో మాతృమూర్తి జక్కా కామేశ్వరమ్మ జ్ఞాపకార్ధం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మించి స్వగ్రామంతోపాటు, పరిసర ప్రాంత గ్రామాలకు వైద్యసేవలందేలా కృషిచేశారు. రెండు రోజులు క్రితం ఆయన మృతిచెందారు. దీంతో నివాళులర్పించారు.
పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం
నెల్లూరు(క్రైమ్): స్వేచ్ఛాయుతా వాతావరణంలో ఎన్నికలు, నేర నియంత్రణే లక్ష్యంగ్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ‘పల్లెనిద్ర’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సమస్యాత్మక, నేరాలు అధికంగా జరిగే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానికంగా ఉన్న యువత, గ్రామపెద్దలతో మమేకమవుతున్నారు. రాత్రివేళల్లో సమావేశాలు నిర్వహిస్తూ అక్కడే బస చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా క్షణాల్లో సమాచారం తెలిసేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, సీ విజిల్ యాప్, బైండోవర్ షరతులు తదితరాలను ప్రజలకు వివరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మద్యం, నగదు, గంజాయి ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన వ్యక్తులు, స్థానికేతరులపై ప్రత్యేక నిఘా ఉంచారు. మరోవైపు సైబర్ నేరాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, మహిళలపై జరిగే నేరాలు, ఇతర చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పినన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అండగా ఉన్నామని భరోసానిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఏపీ ఎమ్మార్పీఎస్
రాష్ట్రాధ్యక్షుడిగా బాబు
నెల్లూరు(వేదాయపాళెం): ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్రాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఏసుపోగు బాబు మాదిగ నియమితులయ్యారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఏసుపోగు బాబును నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు కొండా వెంకటేశ్వర్లు, తాటిపర్తి మణి, విజయ తదితరులు పాల్గొన్నారు.