చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని డివిజన్ జేఏసీ, అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానికంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జేఏసీ, అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వాగ్దానం చేసి మాట తప్పారన్నారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి కూడా మాట మరిచారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఆరు నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్ సాధనకు జూన్ 1న సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, డివిజన్ జేఏసీ నాయకులు తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బూరుగు సురేశ్గౌడ్, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.