శివ్వంపేట(నర్సాపూర్): పదహారు రోజుల కిందట మృతి చెందిన వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం పోలీసులు పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి పోతులబోగూడ గ్రామానికి చెందిన కొంటి పోచయ్య(60) నీటికుంటలో పడి మృతి చెందడంతో సహజ మరణం అనుకొని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భూమి అమ్మకం విషయంలో పోచయ్య అడ్డొస్తున్నాడని నెపంతో రియల్ వ్యాపారులు హత్య చేశారని ఆరోపణలు వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్ సీఐ కృష్ణ నేతృత్వంలో పలువురు అనుమానితులను విచారించారు. శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎస్ఐ మహిపాల్రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అజారుద్దీన్ పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా మృతికి సంబంధించి నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.