సిద్దిపేటఅర్బన్: నాణ్యమైన విత్తనాలతోపాటు నేల రకాన్ని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులతోపాటు ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీదేవి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వరిలో దొడ్డు రకం, సన్న రకాలు, కందిలో దొడ్డు రకానికి సంబంధించిన విత్తనాలను ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రతీ ఏడాది నేల భూసార పరీక్ష చేయించుకోవాలని, నేల రకాలను బట్టి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల విత్తనాలు పరిశోధన కేంద్రం వద్ద అందుబాటులో ఉంటాయని, అవసరం ఉన్న రైతులు విత్తనాలు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. పచ్చి రొట్ట ఎరువులను సాగు చేసి దుక్కిలో కలియదున్నుకోవాలని, దీని వల్ల భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు దొరకని వారు పెసర విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. సిరిసిల్లలోని బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజీ అసోసియేట్ డీన్ డాక్టర్ జీ. శ్రీదేవి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు విత్తన మేళాను నిర్వహిస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులు వివిధ పంటలలో పురుగు మందుల వాడకం, మానవ, పర్యావరణ వ్యవస్థపై పురుగు మందుల అవశేషాల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.
తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం
ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవి