అక్కన్నపేట(హుస్నాబాద్): తల్లిదండ్రులకు గుడి కట్టారు. గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు తనయులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన గొట్టె కొమురవ్వ–కనకయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోగా, ఏడాది కిందట తండ్రి మృతి చెందాడు. శుక్రవారం తండ్రి కనకయ్య మొదటి వర్ధంతి సందర్భంగా గుడిలో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కుమారులు గొట్టె సదయ్య(వ్యవసాయం), మహేందర్(వ్యవసాయం), చిరంజీవి(ప్రైవేట్లో ఉద్యోగం)హైదరాబాద్లో చేస్తున్నాడు. తమను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే తమ వ్యవసాయ పొలంలో ప్రత్యేకంగా గుడి నిర్మించి అందులో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించారు. తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్న అన్నదమ్ములను చూసి గ్రామస్తులు ఎంతో గర్విస్తున్నారు. ఇలాంటి కొడుకలను కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులని గ్రామస్తులు అంటున్నారు.