● అండర్–15 క్రికెట్ టోర్నీలో 79 పరుగులు చేసిన ఆంధ్రా జట్టు కెప్టెన్ సేతుసాయి
ఒంగోలు: మన అమ్మాయి అదరగొట్టింది... దీంతో వడోదర క్రికెట్ స్టేడియం (గౌహతి) చప్పట్లతో మార్మోగింది. సంతనూతలపాడు ఎస్సై వి.ఆంజనేయులు కుమార్తె వీ.సేతు సాయి ప్రకాశం జిల్లా మహిళా క్రికెటర్. ప్రస్తుతం అండర్ 15 కేటగిరీలో ఆంధ్రా క్రికెట్ కెప్టెన్ కూడా. వడోదర క్రికెట్ స్టేడియంలో శనివారం ఆంధ్రా క్రికెట్ జట్టు–అరుణాచల్ప్రదేశ్ జట్ల మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రా జట్టు ఏకంగా 35 ఓవర్లలో 294 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఓపెనర్గా బరిలోకి దిగిన జట్టు కెప్టెన్ వీ.సేతు సాయి ఏకంగా 12 బౌండరీలతో 65 బంతుల్లో 79 పరుగులు చేయగా, మరో ఓపెనర్, కీపర్ అయిన విద్యాశ్రీ 63 బంతుల్లో 15 బౌండరీలతో 91 పరుగులు చేసి అరుణాచల్ ప్రదేశ్ జట్టుకు చుక్కలు చూపించారు. వీరిద్దరి దెబ్బకు అనంతరం బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 33.4 ఓవర్లలో కేవలం 79 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఏసీఏ అడ్హక్ కమిటీ కన్వీనర్ మారెడ్డి రాఘవరెడ్డితోపాటు జిల్లా మహిళా క్రికెటర్లు సేతుసాయికి అభినందనలు తెలిపారు.