విజయనగరం రూరల్: శౌర్యానికి మారుపేరు భారత రక్షణ రంగమని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి పేర్కొన్నారు. భారత నావికా దళ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుకొండ సైనిక పాఠశాలలో నావికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు దేశ రక్షణ రంగంలో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రక్షణ రంగంలో నావికా దళం కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. నావికాదళం దేశరక్షణలో వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. అమరవీరులు, యుద్ధవీరుల సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో కేక్ కట్ చేసి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేస్తున్న ప్రిన్సిపాల్ ఎస్ఎస్ శాస్త్రి, తదితరులు