సత్తెనపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి భారతీయులందరికీ పండుగ రోజు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెండెం బాబూరావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలుకా జైపాల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి, తాలూకా సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి అంబటి రాంబాబు సామాజిక సమానత్వ సాధకుడు, దేశ దార్శనికుడు, మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు ప్రాముఖ్యతనిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని నలుదిక్కులా చాటిచెప్పేలా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించారని గుర్తుచేశారు. విద్య ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని చాటిచెప్పిన అంబేడ్కర్ సిద్ధాంత సాధనలో భాగంగా విద్యారంగాన్ని సంస్కరణల బాట పట్టించిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. నియోజకవర్గంలోనూ దళిత, బడుగు, బలహీన, వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకుడు పక్కాల సూరిబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, రాజుపాలెం ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి, నాయకులు అచ్యుత శివప్రసాద్, కోడిరెక్క దేవదాస్, గుజర్లపూడి సతీష్, చిలుకా నాగేశ్వరరావు, జూపల్లి పాల్, పెద్దింటి నాగేశ్వరరావు, కాశిమాల ఓబయ్య, కాటుమాల డేవిడ్, షేక్ నాగుల్బాషా పాల్గొన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు