కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- - Sakshi

పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి

యడ్లపాడు: అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకట్టుకునేలా కొండవీడులో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి చెప్పారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఎస్పీ రవిశంకర్‌, జేసీ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో చారిత్రక కొండవీడు కోట ప్రాంతాన్ని సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుని స్వాగత ద్వారం, పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న డైనింగ్‌ హాల్‌, చెరువులు, ఇతర అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ నుంచి అంతా కలిసి సజ్జమహాల్‌ బురుజు పైకి ట్రెక్కింగ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికం అయ్యేలా పల్నాడు జిల్లాలోని చారిత్రక ప్రదేశం కొండవీడు కోటను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే కొండపైకి విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం ఏర్పాటు చేసి విద్యుత్‌ పోల్స్‌, సరఫరా ఇవ్వడం జరిగిందన్నారు. వెదుళ్ల చెరువు ఆహ్లాదకర వాతావారణాన్ని వీక్షించడంతో పాటు, అక్కడే సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా చెరువుపై పది అడుగులు లోపలికి ప్లాంక్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top