కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకీరుగూడెంలో ఇరువర్గాల మధ్య దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ దాడిలో ఒక వర్గానికి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వర్గానికి చెందిన నలుగురు పరారీలో ఉండగా కీలక సూత్రధారుడు గుండుబాస్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గిరిపురానికి చెందిన రాచేటి సత్యకుమార్ అలియాస్ గుండుబాస్ సుమారు నెలన్నర క్రితం ఫకీరుగూడెంకు చెందిన కె.నానితో ఏకవచనంతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం దమ్ముంటే ఫకీరుగూడెం రావాలని నాని వర్గంలోని మణి, మధు, వసంత్, టెర్రస్ గుండుబాస్ వర్గంలోని రాజేష్, శ్యామ్, తిమ్ము, అఖిల్, గోపీలకు సవాల్ విసిరారు. అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో గుండుబాస్ వర్గం ద్విచక్ర వాహనాలపై ఫకీరుగూడెంకు వచ్చారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి గొడవ పడి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. నాని వర్గంలోని మణిపై రాజేష్ దాడి చేసి గాయపరచగా గుండుబాస్ వర్గంలో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సీఐ మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.