![మేఘాలయలో సేంద్రియ పసుపు క్షేత్ర సందర్శన](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25nzt02-604902_mr.jpg.webp?itok=7xJzTBm-)
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో గల మూలియ్ గ్రామాన్ని జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి శనివారం సందర్శించారు. ఆ గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పసుపు పండిస్తున్న మహిళా రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ట్రినిటీ సాయోను కలిశారు. ట్రినిటీ సాయో ఎఫ్పీవో(ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్)ను స్థాపించి దాన్ని నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించా రు. ఆమె సేంద్రియ విధానంలో పండిస్తున్న ‘లకడాన్’ అనే రకం పసుపును పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ట్రినిటీ సాయో పండిస్తున్న లకడాన్ పసుపు లో కర్క్యుమిన్ 7 నుంచి 13 శాతం వరకు వస్తోందన్నారు. మహిళా రైతులు కలిసి ఒక సొసైటీగా ఏర్పడి పసుపు పండిస్తుండడంతో పాటు, ట్రినిటీ సాయో చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆమె కు ఉత్తమ మహిళా రైతు అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డు ఇచ్చిందన్నారు. ఈమె పసుపు పంటను సేంద్రియ విధానంలో పండించి, ఆ పంటను ఉడకబెట్టకుండా ఆరబెట్టి, తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి అనంతరం పసుపు పౌడర్ తయారు చేసి 200 గ్రాముల నుంచి 50 కిలోల వరకు ప్యాకేజ్ చేసుకుంటూ మార్కెటింగ్ చేస్తున్నారన్నారు. ఈమెకు కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున సబ్సిడీలు అందజేస్తూ అధిక కర్క్యుమిన్ సాధించేలా ప్రోత్సహిస్తోందన్నారు. ఈ గ్రామానికి తాను పసుపు రైతుగా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే తెలంగాణలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బలంగా లేవన్నా రు. మన పసుపు పంటలో కుర్క్యుమిన్శాతం కేవ లం 3 నుంచి 4 శాతం ఉంటుందన్నారు. మేఘాల య రైతులు 7 నుంచి 13 శాతం తీస్తున్నారన్నారు. తెలంగాణలోనూ ఈవిధంగా పసుపు సాగు చేస్తే 5 నుంచి 10 శాతం వరకు కర్క్యుమిన్ వచ్చేలా చేయవచ్చన్నారు. దీంతో ఇందూరు ప్రాంత పసుపునకు డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచన మేరకు మేఘాలయలోని ఉత్తమ పసుపు రైతును కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నానన్నారు. వివరాలను ఎంపీకి ఇవ్వనున్నట్లు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మన ప్రాంతంలోనూ ఇలాంటి ఎఫ్పీవోలను ఏర్పా టు చేసి సేంద్రియ పద్ధతిలో పసుపు సాగుచేసే విషయమై ఎంపీకి నివేదిక అందిస్తానన్నారు.
మహిళా పసుపు రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను కలిసిన కిసాన్ మోర్చా
జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి