మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలను వెలుగులోకి తేవాలని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు రాష్ట్ర విజిలెన్స్ ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని కప్పల వా గు, పెద్దవాగులపై 12 చోట్ల చెక్డ్యాంలను నిర్మించారు. మరో ఐదు చెక్డ్యాంలను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాల కంటే వాటి నాణ్య తా లోపాలు, నీటి లీకేజీ, కట్టలు తెగిపోవడం వల్ల నష్టమే ఎక్కువగా జరిగింది. ఫలితంగా వాగులకు ఇరువైపులా ఉన్న వందల ఎకరాల పంట భూము లు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో చెక్డ్యాంకు రూ. 4.50 కోట్ల నుంచి రూ. 9.80 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ప్రతి చెక్డ్యాం నిర్మాణంలో ఎక్కడో ఒక చోట లోపాలు తలెత్తాయి. చెక్డ్యాంల నిర్మాణం విష యంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని అనవసరంగా అంచనాలను పెంచి ఎక్కువ నిధులను ఖర్చు చేయించారనే ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కో చెక్డ్యాం విషయంలో ఒక విధమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి చెక్డ్యాంల నిర్మాణం నిధుల మంజూరు విషయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించారు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్కు కూడా విన్నవించారు. దీనికి స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖ నుంచి అన్ని చెక్డ్యాంల ఫైళ్లను పంపాలని కోరారు.
ఇరకాటంలో కింది స్థాయి ఉద్యోగులు
చెక్డ్యాం నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను అప్పగించాలని నీటిపారుదల శాఖ బాల్కొండ ఈఈ భా నుప్రకాశ్ను విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ఆయనను ఇటీవల విజిలెన్స్ రాష్ట్ర కార్యాలయానికి రప్పించి ప్రతి చెక్డ్యాంకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులు, టెక్నికల్ అనుమతి, ఎంబీ రికార్డులు ఇతర నివేదికలను ఇవ్వాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో నీటిపారుదల శా ఖలోని కిందిస్థాయి ఉద్యోగుల, ఇతర అధికారులు ఇరకాటంలో పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నేతల ఒత్తిడికి తలొగ్గి సాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేసి ఇప్పుడు తాము ఇబ్బందుల్లో పడుతున్నామని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్ విచారణ జరిగితే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లకు ఏమి కాదని ఏదైనా లోపాలు కనిపిస్తే తమకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు.
చెక్డ్యాంల నిర్మాణాల్లో
అక్రమాలపై విచారణ
చేయించాలని సీఎంకు ఫిర్యాదు
రికార్డులను ఇవ్వాలని
నీటిపారుదల శాఖ అధికారులను
ఆదేశించిన విజిలెన్స్