కమ్మర్పల్లి: మోర్తాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో ఈనెల 21న పురుషుల కోసం నిర్వహించే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరసింహాస్వామి పేర్కొన్నారు. శుక్రవారం కమ్మర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జన ఆరోగ్య సమితి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. దోమల బెడదను నివారించేందుకు ఫ్రై డే డ్రై డేగా నిర్వహించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీపీ కార్యదర్శి శాంతికుమార్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
విద్యుత్ బిల్లుల
చెల్లింపులో ఆదర్శం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన రైతులు ఒకే రోజులో వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని 640 వ్యవసాయ మోటార్లకు సంబంధించిన రూ.2,32,200 విద్యుత్ బిల్లులను శుక్రవారం చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రావణ్ కుమార్, లైన్మెన్లు సల్ల శ్రీనివాస్ యాదవ్, కుమార స్వా మి, జేఎల్ఎం లింబాద్రి, రమేష్, దినేష్, రైతు లు హోండా నర్సా రెడ్డి,నర్సయ్య పాల్గొన్నారు.
సాంఘిక బహిష్కరణ సరికాదు
కమ్మర్పల్లి: వేల్పూర్ మండల కేంద్రంలో ముస్లింలపై గ్రామాభివృద్ధి సాంఘిక బహిష్కరణ విధించడం సరికాదని కమ్మర్పల్లి ముస్లిం కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం మండల కేంద్రంలోని ముస్లిం కమిటీ సభ్యులు సమావేశమై వేల్పూర్లో బహిష్కరణ విధించడాన్ని ఖండించారు. ఈద్గా స్థలానికి సంబంధించి పహానీ, రెవెన్యూ, వక్ఫ్ రికార్డులు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యంగా సాంఘిక బహిష్కరణ విధించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. జిల్లా అధికార యంత్రాంగం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి
ఆదిమల్లన్న జాతర
వేల్పూర్: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శనివారం నుంచి ఆది మల్లన్న జాతర ఉత్సవాలు జరుగుతాయని వీడీసీ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు వారు శుక్రవారం జాతర ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. శనివారం గ్రామంలో ఆదిమల్లన్న శోభాయాత్ర, ఆదివారం గంగస్నానము, సోమవా రం గ్రామం నుంచి ఆదిమల్లన్న గుట్టకు రథాన్ని తీసుకెళ్లడం, మంగళవారం జాతర, రథోత్సవం, బుధవారం నైవేద్యాలు సమర్పించుకోవడం, అదేరోజు రాత్రి నాగవెల్లి, అగ్నిగుండం, గుట్టచుట్టూ శోభాయాత్ర నిర్వహించడం కార్యక్రమాలు జరుగుతాయన్నారు.