![సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25knl14-200015_mr.jpg.webp?itok=Rk63NwPJ)
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయండి
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈనెల 28వ తేదీలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల హాళ్లలోని లోపల, బయట చేపట్టే అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకొని ఏజెంట్లను గుర్తించే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మొబైల్ డిపాజిట్ సెంటర్, లంచ్ టెంట్లను కూడా ఏర్పాటు చేయాలని డీఆర్వో, ఆర్అండ్బీ ఎస్ఈలను ఆదేశించారు. జూన్ 3వ తేదీన జిల్లా ట్రెజరీ నుంచి పోస్టల్ బ్యాలెట్లను రాయలసీమ యూనివర్సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో ఆర్వోలు నారపురెడ్డి మౌర్య, భార్గవ్తేజ, శివ్నారాయణ్ శర్మ పాల్గొన్నారు.
కర్నూలు(సెంట్రల్): జూన్ 4వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన పోలీసులకు సూచించారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీ సులు అప్రమత్తంగా ఉండి ప్రశాంతం వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కౌంటింగ్ రోజున చేపట్టాల్సిన భద్రత పరమైన అంశాలపై చర్చించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా భద్రతా ప్రణాళిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్తోపాటు అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇందుకు పోలీసుల కృషియే కారణమని ఎస్పీ జి.కృష్ణకాంత్ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ రోజున జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముందుగా గత ఎన్నికల సమయాల్లో అల్లర్లు జరిగిన సున్నతమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. మండల హెడ్ క్వార్టర్స్లో ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ నిబంధనలు, నియమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆర్వోలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ రోజున జరిగిన సంఘటనల ఆధారంగా జిల్లాలో మొత్తం 188 సున్నితమైన ప్రాంతాలు గుర్తించి పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ పట్టణాల నుంచి రాయలసీమ యూనివర్సిటీకి వచ్చే రహదారుల్లో 31 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాణసంచా పేల్చేందుకు అనుమతి లేదని, కౌంటింగ్ రోజున వాటిని విక్రయించడానికి వీలులేదని గోడౌన్ యజమానులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్.నాగరాజు, నాగబాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ రోజు అల్లర్లు,
ఘర్షణలను అడ్డుకోండి
జిల్లా భద్రతా ప్రణాళిక కమిటీ
సమావేశంలో
జిల్లా ఎన్నికల అధికారి సృజన