● దిగుబడులు ఆశాజనకం
● ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడులు
● ముమ్మరంగా కోత, నూర్పిడి పనులు
ఈ ఏడాది రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోయినా సాగునీటి వనరులు అందుబాటులో ఉండటంతో వరి రైతులు గట్టెక్కారు. స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండల్లాలో ఈ ఏడాది రబీలో 7,755 ఎకరాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. ఆయా మండలాల పరిధిలో బావులు, చెరువులు, కుంటలు, బోర్ల ఆధారంగా 3,845 ఎకరాల్లో రైతులు కర్నూలు సోనా, 555 రకానికి చెందిన వరి సాగు చేశారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. సాగునీరు పుష్కలంగా అందటంతో పంట చేతికందింది. ఆయా ప్రాంతాల్లో కంబైండ్ హార్వెస్టర్లతో కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎకరాకు 30 బస్తాల దిగబడులు వస్తుండటంతో అన్నదాత ఊరట చెందుతున్నారు. వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండటంతో పెట్టుబడులు పోనూ నికర ఆదాయం చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కోవెలకుంట్ల