శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు నల్లమల అందాలు, కృష్ణమ్మ సోయగాలు తనివితీరా ఆస్వాదించేందుకు భక్తులు తరలివస్తున్నారు. వేసవికాలం కావడం, పిల్లలకు పరీక్షలు పూర్తవడంతో చాలా మంది శ్రీశైల యాత్ర చేస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు ఆలయ పరిసరాల్లోని సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం, శ్రీశైల డ్యాం అందాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే శ్రీశైలం పాతాళగంగలో బోటింగ్ చేస్తున్నారు.
రోప్వే సదుపాయం
పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇందు కోసం శ్రీశైల యాత్రకు విచ్చేసిన భక్తులు పాతాళగంగ పుణ్యస్నానాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్వంతో పాతాళగంగకు రోప్ వే ఏర్పాటు చేశారు. రోప్ వే ద్వారా భక్తులు సులభతరంగా పాతాళగంగకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రోప్వేలో పాతాళగంగకు చేరుకునేందుకు పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
కృష్ణానదిలో బోటు షికార్
భక్తుల సౌకర్యార్థం ఏపీ టూరిజం శాఖ బోటు షికార్ను ఏర్పాటు చేసింది. కృష్ణానదిలో బోటులో ప్రయాణించి నల్లమల అందాలు, కృష్ణానది సో యగాలను ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏపీ టూరిజం శాఖ తరఫున భక్తుల భద్రతే ము ఖ్యంగా బోటులో భద్రతా చర్యలు పాటిస్తూ బోటు షికార్ నిర్వహిస్తున్నారు. ఈ బోటు షికార్ శ్రీశైలం పాతాళగంగ నుంచి డ్యాం వద్దకు వెళ్లి తిరిగి పాతాళగంగ వద్దకు చేరుకుంటుంది. ఇందుకోసం పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.60 ధర చెల్లించాల్సి ఉంటుంది. కృష్ణానది సోయగాలను ఆస్వాదిస్తూ ఏర్పాటు చేసిన జాయ్ ట్రిప్ పర్యాటకులను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. శ్రీశైలం యాత్ర మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.
కృష్ణమ్మ ఒడిలో బోటు ప్రయాణం ఆహ్లాదకరం
రోప్వే ద్వారా పాతాళగంగకు మల్లన్న భక్తులు
పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏపీ టూరిజం శాఖ