తప్పుల్లేని ఓటరు జాబితాకు సహకరించాలి
కర్నూలు(సెంట్రల్): తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కోరారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్–2024పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముసాయిదా జాబితాలో దొంగ ఓటర్లు ఉంటే గుర్తించి ఫిర్యాదు చేయాలని కోరారు. డబుల్ ఎంట్రీలు, సిమిలర్ ఫొటో ఎంట్రీస్ ఉన్నా తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేయించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముసాయిదా జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించేందుకు డిసెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. బీఎల్ఓలు ఇంటింటా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్స్టేషన్లో ఓటు వేసేలా కేంద్రాలను కేటాయించాలన్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్వో మధుసూదనరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ పోస్టర్ ఆవిష్కరణ
కర్నూలులో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడలకు సంబంధించి పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. పోటీలనిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రంగారెడ్డి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల కార్యదర్శులు ఎం.వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ శేఖర్, ఎంఎండీ బాషా పాల్గొన్నారు.
భూ సమస్యలు పరిష్కరించండి
గూడూరు రూరల్: భూ సమస్యలకు సంబంఽధించి వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. గూడూరులోని వైకేపీ కార్యాలయంలో గురువారం జగనన్నకు చెబుదాం– స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి 69 అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి అర్జీకి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని ఆమె అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆర్డీఓ హరిప్రసాద్, తహసీల్దార్ వెంకటరమణ, నగర పంచాయతీ చైర్మన్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.సృజన