పక్కా ఇళ్లను పరిశీలించిన కేంద్ర బృందం
పెనమలూరు: ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వణుకూరు గ్రామంలో పేదలు నిర్మించుకున్న గృహాలను కేంద్ర బృందం అధికారులు శనివారం పరిశీలించారు. గ్రామంలోని అర్బన్ లేఅవుటుల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాలను పీఎంవై అర్బన్ హౌసింగ్ ఫర్ ఆల్ డైరెక్టర్ ఆర్.కె. గౌతమ్, లీడ్ ఇంజినీర్లు సునీల్ పరేక్, మనీష్, స్పెషల్ సెక్రెటరీ హౌసింగ్ మైదీన్దివాన్, హౌసింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ జి.వి. ప్రసాద్ సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. గృహాలు లేని సమయంలో ఎలా జీవించారని లబ్ధిదారులను కేంద్ర అధికారులు ప్రశ్నించారు. గతంలో ప్రతి నెలా రూ.4 వేల ఇంటి అద్దె చెల్లించామని లబ్ధిదారులు బదులి చ్చారు. ఇళ్ల నిర్మాణంపై కేంద్ర అధికార బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యకమంలో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కబడ్డీ విజేత శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
ఉయ్యూరు(పెనమలూరు): కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ విజేతగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నిలిచింది. స్థానిక ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ క్రీడామైదానంలో రెండు రోజులు జరిగిన అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు శనివారం ఉత్కంఠ భరితంగా ముగిశాయి. ఏజీ అండ్ ఎస్జీ డిగ్రీ కళాశాల జట్టు ద్వితీయ స్థానం, పీవీ సిద్ధార్థ కళాశాల జట్టు తృతీయ స్థానం కై వసం చేసుకున్నాయి. విజేత లకు సిద్ధార్థ అకాడమీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ఎల్.కె.మోహన్రావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, లయన్స్ జిల్లా క్యాబినెట్ కోశాధికారి నూకల వెంకట సాంబ శివరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.శ్రీరామ్, జూనియర్ కళాశాల డైరెక్టర్ జి.జె.పి.వినయ్కుమార్ పాల్గొన్నారు. వ్యాయామ అధ్యాపకులు పోటీలను పర్యవేక్షించారు.
ప్రకృతితో కలిసి జీవించాలి
ఉంగుటూరు: ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలసి జీవించడం యువత తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని విజయవాడ చాప్టర్ స్వర్ణభారత్ ట్రస్ట్లో శిక్షణలో ఉన్న అభ్యర్థులతో శనివారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్రస్ట్లో పలు కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులతో ముచ్చటించారు. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొదువ లేదని వారికి నైపుణ్యం అందిస్తే చాలని అన్నారు. నైపుణ్యం పెంపొందించు కున్న యువత దేశ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా అవతరిస్తారని పేర్కొన్నారు. ప్రకృతిని విస్మరించడం వల్ల వైపరీత్యాలు సంభవిస్తున్నా యని చెప్పారు. ప్రకృతిని ప్రేమిస్తే మానవాళిని కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ పరదేశి తదితరులు పాల్గొన్నారు.