కాసిపేట: ఎన్నికల నేపథ్యంలో ఉత్పత్తికి ఇబ్బంది కలగకుండా గనుల ఆవరణలో సమావేశాలు, ప్రచారం నిర్వహించడాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ అమలుకు నోచుకోవడంలేదు. దీంతో ఆయా పార్టీలు ఎన్నికల సమావేశాలు గని బయట నిర్వహిస్తున్నాయి. కాగా, గని బయట నిర్వహిస్తున్న సమావేశాలకు కార్మికులు వెళ్తుండడంతో అరగంటకు మించి సమయం అదనంగా గడుస్తుండగా ఉత్పత్తికి ఇబ్బంది తప్పడం లేదు. ఈ తీరును చూస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది అధికారుల పరిస్థితి. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య గని బయట సమావేశం నిర్వహించారు. దీంతో టీబీజీకేఎస్ శ్రేణులు కార్మికులను మీటింగ్ వద్దకు తరలించగా ఉదయం 8.25గంటలకు కార్మికుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 7.15గంటలకు మస్టర్లు పడిన కార్మికులను 7.30గంటల నుంచి పనిస్థలాలు కేటాయించి పనులకు పంపిస్తారు. సమావేశాలతో గంట ఆలస్యంగా పనుల కేటాయింపు చేపట్టడం చర్చనీ యాంశమైంది. గని ఆవరణలో సమావేశం నిర్వహిస్తే 10నుంచి 15నిమిషాలు ఆలస్యం కాగానే అధికారులు కార్మికులను పిలుస్తూ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభిస్తారు. గని బయట సమావేశాలు పెట్టడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. మరోవైపు గుర్తింపు సంఘం నాయకులు కావడంతో వద్దు అని బద్నాం కావడం.. వారితో శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు? అని అధికారులు మిన్నకుండిపోయారు. ఈకారణం చూపి మరో రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా అధికారులు వేచి చూడాల్సిందే. ఈ తరుణంలో సర్క్యులర్తో అదనంగా నష్టమే గాని ఎలాంటి ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మరో 10 రోజులు అధికారులకు సర్క్యులర్తో తలనొప్పులు తప్పేలా లేవు.
మిస్సింగ్ కేసు నమెదు
తిర్యాణి: మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన యువకుడు సిరి పురం కృష్ణ ఈనెల 16న ఉదయం తాండూర్ ఐబీకి వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతడికి ఫోన్ చేస్తే సెల్ స్విచాఫ్ వచ్చింది. ఎంత వెతికినా అతడి ఆచూ కీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మే రకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.