అలంపూర్: మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం అలంపూర్లోని 1, 7, 9 వార్డుల్లో కలెక్టర్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ భీమేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, ఇంజనీర్ మేఘనాథ్గౌడ్ పర్యటించి నీటి సమస్య గురించి ఆరా తీశారు. అలాగే, తుంగభద్ర నదిలో పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా చేయాలని, రాబోయే రెండు నెలలు తాగునీటి సరఫరా కీలకంగా ఉంటుందని, ఇందుకోసం రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, చేతి పంపులు, బోరు మోటార్లు, పైపు లైన్ల లీకేజీల మరమ్మతు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. పైప్లైన్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉండటంతో తక్షణమే మరమ్మతు చేపట్టాలన్నారు. తుంగభద్ర నదిలో నిలువ ఉన్న నీటిని పంపింగ్ చేసి గృహ అవసరాలకు వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టాలన్నారు.
పాఠశాలల ఆకస్మిక తనిఖీ..
మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల, మన ఊరు మనబడి పథకం కింద ఎంపికై న ఈ పాఠశాలల్లో చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తాగునీరు, ఫ్లోరింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోగా పూర్తి చేయాలని సూచించారు. వీరితోపాటు ఎంపీడీఓ అబ్దుల్ జబ్బార్, ఎంఈఓ అశోక్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.