![నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/24/23jgn150-330150_mr.jpg.webp?itok=5_fCG_h5)
జనగామ రూరల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, నాణ్యమైన విత్తనాలు అమ్మాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీ సీతారాం, ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి వానాకాలం పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 237 విత్తన దుకానాలు, 238 ఎరువులు, 183 పురుగు మందుల షాపులు ఉన్నాయని, వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖలు డీలర్లను సమన్వయం చేసుకుని నకిలీ విత్తనాలను అరికట్టడానికి చర్యలు చేపట్టాలన్నారు. నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డీలర్లు విత్తన చట్టానికి లోబడి నిబంధనలు అనుసరిస్తూ వ్యాపారం నిర్వహించాలని సూచించారు. స్టాక్ బోర్డు, రిజిస్టర్ విధిగా నిర్వహించాలని, సీడ్ డీలర్లు సైతం సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. డీసీపీ సీతారాం మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా రెన్యూవల్ చేయకుండా, కాలపరిమితి ముగిసిన వాటిని విక్రయించొద్దని చెప్పారు. అంతకు ముందు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. డీఏఓ వినోద్కుమార్, విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడు పజ్జూరు గోపయ్య, ఏడీఏలు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా