పసివాళ్ల పట్ల ప్రాణాంతకమవుతున్న పరిస్థితి
డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఓఆర్ఎస్లనే వాడాలి
డీహైడ్రేషన్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఇది ఓఆర్ఎస్ కాదని ముద్రించిన దృశ్యం
ఓఆర్ఎస్ ప్యాకెట్లపైనున్న లేబుల్ చదవకుండా ఇదే అసలైన ఓఆర్ఎస్ అని కొనడం అలవాటుగా మారింది. సాధారణంగా మండుతున్న ఎండలకు లేదా వైరస్ కారణంగా సంక్రమించే డయేరియా (నీళ్ల విరేచనాలు, వాంతులు) ప్రభావంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో శరీరంలోని నీరు, లవణాలు తగ్గిపోయి నీరసమైపోతారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి లీటరుకు 13.5గ్రా చక్కెర (గ్లూకోస్) స్థాయిలు, 2.6గ్రా సోడియం, 1.5 గ్రా పొటాషియం ఉండేలా నిర్ధారించిన ఓఆర్ఎస్లను తీసుకోవాలి. కానీ.. మార్కెట్లో లభించే వాటిలో 20 గ్రాములకుపైగా షుగర్ కలుపుతున్నారు. అధిక స్థాయిలో శరీరంలోకి చేరిన చక్కెర స్థాయిలు డీహైడ్రేషన్ను మరింత పెంచి చిన్నారుల మరణాలకు కారణంగా మారుతోందని పులువురు వైద్యులు సూచిస్తున్నారు.
మండే ఎండలకు తాళలేక.. మందుల దుకాణానికి వెళ్లి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) తీసుకుని తాగుతున్నారా? అయితే.. తస్మాత్ జాగ్రత్త. అక్కడ లభించేవన్నీ అసలైన ఓఆర్ఎస్లు కావు. నిజమైన ఓఆర్ఎస్లా మభ్యపెట్టి అమ్ముకుంటున్న ఇతర పానీయాలు మాత్రమే. ఓఆర్ఎస్ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ పద్ధతి చిన్నారుల మరణాలకు దారి తీస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓఆర్ఎస్ల వాడకంపై అవగాహన కల్పించడానికి నగరంలో హీల్ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అయిదేళ్లలోపు చిన్నారుల్లో 13 శాతం మరణాలు కేవలం డీహైడ్రేషన్ వల్లే సంభవిస్తున్నాయని, ౖఅతిసారంతో బాధపడుతున్న పిల్లల్లో 60.6% మంది ప్రాణాలను రక్షించే ఓఆర్ఎస్ను తీసుకోలేకపోతున్నారని హీల్ ఫౌండేషన్ వెల్లడించింది. మార్కెట్లో లభించే ఉత్పత్తుల పేరులో ఓఆర్ఎస్ ఉండే విధంగా మార్చుకుని.. దాని కిందే చిన్న అక్షరాలతో ‘ఇది ఓఆర్ఎస్ కాదు’ అంటూనే ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో