No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 25 2024 6:05 PM

-

కుత్బుల్లాపూర్‌: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా కండక్టర్‌ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్‌ కూకట్‌పల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కార్మికులతో కిషన్‌ రాసలీలలు బయటపడడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అతడిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్‌ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్‌ చేయాలని కూకట్‌పల్లి జడ్‌సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా..

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్‌ఫోన్‌లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కార్మికుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్‌ యూనిట్‌లో వెలుగులోకి వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ ఎదుట వివరణ..

● గ్రేటర్‌ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్‌ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌ రెడ్డితో పాటు కిషన్‌ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్‌ మిషన్‌ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కార్మికులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు.

● తన రాసలీలల వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్‌.. అది వైరల్‌ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్‌.. ఈ నెల 17న ఉప కమిషనర్‌ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు.

వీడియోల లీక్‌పై ఆరా..

గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్‌ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్‌ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్‌ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

కాళ్లు మొక్కి.. కవర్‌ చేసి..

శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్‌ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్‌ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కార్మికునికి ఫోన్‌ ఇవ్వడం.. ప్రణయ్‌ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్‌ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్‌ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement