హన్మకొండ: చట్టసభల గౌరవం పెంచే వ్యక్తిని శాసన మండలికి ఎన్నుకోవాలని నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. మాయగాళ్లు, మోసగాళ్లు చట్ట సభలో ఉండకూడదని, బెదిరించే అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను, వ్యాపారవేత్తలను ఏం చేస్తారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే వారిని కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసే తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలన్నారు. తాను రైతు బిడ్డనని, కష్టాలు, సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. అధికారం కోసం కాదు ఆశయం కోసం పని చేస్తానన్నారు. జీఓ 46 రద్దుకు మడమ తిప్పని పోరాటం చేస్తానన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, నాయకులు రవీందర్సింగ్, కె.వాసుదేవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్, నయీముద్దీన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి