గుంటూరు వెస్ట్: దేశ రక్షణ కోసం సైనికులు చేసే త్యాగాలకు వెలకట్టలేమని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జాయింట్ కలెక్టర్ రాజకుమారితో కలిసి సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుద్ధంలో మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన సైనికుల కుటుంబాల సంక్షేమాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తోచిన సాయం చేయాలని కోరారు. మరణాన్ని త్రుణప్రాయంగా భావించే సైనికుల త్యాగాలు ఎంత చెప్పినా తక్కువేనన్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణశీల, సిబ్బంది పాల్గొన్నారు.