సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం నిర్వహించిన తొలి విడత శిక్షణ తరగతులకు 73 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి కారణాలు తెలియజేయాలని ఆదేశిస్తూ వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారందరూ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగతంగా హాజరై శిక్షణకు గైర్హాజరవడానికి గల కారణాలపై రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కారణం సహేతుకంగా లేకపోయినా, అవాస్తవమైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగీ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రశాంతంగా శ్లాస్ పరీక్ష
కంబాలచెరువు: స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే (శ్లాస్) పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 121 పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహించామన్నారు. దీనికి 3,832 మంది హాజరుకావాల్సి ఉండగా, 3,682 మంది పరీక్ష రాశారన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయి మదింపునకు ఈ పరీక్షను ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించామన్నారు. దీనికోసం ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
మళ్లీ వచ్చేది
సంక్షేమ ప్రభుత్వమే
వైఎస్సార్ సీపీ నేత శెట్టిబత్తుల రాజబాబు
అమలాపురం టౌన్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది సంక్షేమ ప్రభుత్వమే. మాట తప్పని జననేత ముఖ్యమంత్రి జగన్ వైపే ప్రజలు ఉన్నారని ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. అమలాపురం నల్ల వంతెన సమీపంలో గల ఎన్వీఆర్ నగర్లోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజబాబు మాట్లాడారు. ప్రజల అవసరాలను గుర్తెరిగి సంక్షేమాన్ని అందించే, మాట ఇచ్చారంటే మడం తిప్పని జగన్ నైజానికి ఆకర్షితుడినై తాను వైఎస్సార్ సీపీలో చేరానని చెప్పారు. విజయవాడ సిద్ధం సభ బస్సు యాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న అక్కసు, కుట్రతో ఈ దాడి చేశారని అన్నారు. జిల్లాలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుతోపాటు ఏడు అసెంబ్లీ నియోకవర్గాల పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు సందాడి శ్రీనుబాబు, ముత్తాబత్తుల శ్రీను, చవల వెంకటేశ్వరరావు, పోతుమూడి రవికుమార్, దాసరి శ్రీను, జనుపెల్ల శివాజీ పాల్గొన్నారు.